ప్రజాస్వామ్యం ఎప్పుడూ ప్రజల చేతిలోనే ఉంటుంది. వారి శక్తి ఓటు రూపంలో కనిపిస్తుంది. ఒక్క ఓటుకు విలువ లేదనుకోవడమే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద నష్టం. చాలా ఎన్నికల్లో ఒక్కఓటు తేడాతో విజయం లేదా అపజయం నిర్ణయమైన సందర్భాలున్నాయి. మనం వేసే ఓటే నాయకులను నిర్ణయిస్తుంది, పాలనా దిశను మార్చుతుంది. ఓటుహక్కు మనకు ఉచితంగా రాలేదు. ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితంగా దక్కింది. అందుకే ఓటు వేయకపోవడం అంటే ఆ త్యాగాలను నిర్లక్ష్యం చేసినట్లే. నాఒక్కడితో ఏమవుతుందిలే అనుకోవద్దు. ప్రతి ఒక్కరి ఓటు కలిసినప్పుడే బలమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది.
తాజాగా అమెరికా నుంచి వచ్చి వేసిన ఒక్క ఓటు తేడాతో కోడలు గెలిచింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ ఉత్కంఠభరిత ఫలితం వెలువడింది. కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన ముత్యాల శ్రీవేద కేవలం ఒక్ ఓటు తేడాతో విజయం సాధించి సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో శ్రీవేద పోటీ చేస్తున్న విషయం తెలిసిన వెంటనే ఆమె మామ ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి అమెరికా నుంచి నాలుగు రోజులముందే స్వగ్రామానికి వచ్చి తన ఓటుహక్కు వినియోగించారు. ఆ ఒక్క ఓటే చివరికి ఫలితాన్ని మార్చిందని గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి:
మొత్తం ఓట్లు: 426
పోలైన ఓట్లు: 378
ముత్యాల శ్రీవేద: 189 ఓట్లు
హర్షస్వాతి: 188 ఓట్లు
చెల్లని ఓట్లు: 1
కేవలం ఒక్కఓటు తేడాతో వచ్చిన ఈ విజయం ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువ ఎంత ముఖ్యమో చాటిచెప్పింది. గ్రామంలో సంబరాలు అంబరాన్ని అంటుతుండగా, ఓటు హక్కు ప్రాధాన్యతపై ఈ ఘటన అందరికీ గుర్తుండిపోయే ఉదాహరణగా నిలిచింది.















Comments are closed