మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ వివాదం కారణంగా చోటుచేసుకున్న మృతి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అదనపు కట్నం కోసం వేధించడం, దాంపత్య సమస్యలు చివరకు ప్రాణాంతక దాడికి దారితీసి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయేలా చేసాయి.. ఈ ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. బాలాజీ హిల్స్, పాత కలెక్టర్ ఆఫీస్ ప్రాంతానికి చెందిన బానోత్ లాలూ నాయక్ తన కూతురు శ్రీ సాయిలహరికి కురవి మండలం గుండ్రాతిమడుగు పెద్ద తండాకు చెందిన గూగులోత్ గాంధీ బాబును వివాహం చేశారు.
అయితే వివాహం జరిగిన రోజుల నుండి సాయిలహరిపై అదనపు కట్నం పేరుతో భర్త గాంధీ బాబు, అతని తల్లితండ్రులు మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడుతున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో డిశంబర్ 11వతేదీ రాత్రి 12 గంటలకు సాయిలహరి తన తండ్రి లాలూ నాయక్కు ఫోన్ చేసి, భర్తతో పాటు అత్తమామలు కలిసి తనపై దాడి చేస్తున్నారని, ప్రాణహాని ఉందని కన్నీటితో చెప్పింది.
దాంతో ఆందోళన చెందిన లాలూ నాయక్ తన కుమారుడు ప్రదీప్ తో కలిసి మిలిటరీ కాలనీలో ఉన్న నిందితుల ఇంటికి చేరుకున్నారు. అక్కడ చేరుకున్న వెంటనే లాలూ నాయక్ను రక్షించడానికన్నా, నిందితుడు గాంధీబాబు, అతని తల్లితండ్రులు సీతారాం, కవిత ముగ్గురు కలిసి లాలూ నాయక్ మరియు ప్రదీప్పై దాడి చేసినట్లు ప్రదీప్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. చేతులతో, పిడిగుద్దులతో తీవ్రంగా కొట్టిన నిందితుల దాడిలో లాలూ నాయక్ ఛాతీ భాగం సహా శరీరంలోని పలు భాగాలపై గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు.
ప్రదీప్ కూడా దాడిలో గాయపడ్డాడు. ఈ ఘటనపై ప్రదీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు. నిందితుల అరెస్టు కోసం ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. కేసు యొక్క పూర్తి వివరాలు దర్యాప్తులో వెలుగులోకొచ్చే అవకాశం ఉంది.














Comments are closed