కల్తీ ఆహార పదార్థాలు, తినుబండారాల విక్రయాలపై హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. ప్రజారోగ్యానికి హాని కలిగించేలా కల్తీ నెయ్యి అమ్ముతున్న ఓ టిఫిన్ సెంటర్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సికింద్రాబాద్ సెకండ్ బజార్కు చెందిన అన్నామలై మోండా మార్కెట్లో టిఫిన్ దుకాణం నిర్వహిస్తున్నాడు.. ఆ వ్యాపారంలో నష్టాలు రావడంతో, అన్నమలై అడ్డదారిలో మార్కెట్లో ఆవునెయ్యికి డిమాండ్ను అవకాశంగా మలుచుకు్నాడు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందాలనే దురుద్దేశంతో ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలను ఉపయోగించి చౌకగా కల్తీ నెయ్యి తయారీకి పూనుకున్నాడు. కొబ్బరి నూనె, డాల్డా ఫుడ్ కలర్స్ కలిపి కల్తీ ఆవునెయ్యి తయారు చేస్తున్నాడు. కల్తీనెయ్యిని అతను ‘లుకా’ అనే బ్రాండింగ్ పేరుతో లీటరు ప్యాకెట్లలో ప్యాక్ చేసి, మార్కెట్లో లీటరు స్వచ్ఛమైన నెయ్యి ధరకు కొద్దిగా తక్కువగా అంటే రూ.600 లకు విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడు. అదేనెయ్యిని అలాగే పూజా స్టోర్లలోనూ అమ్ముతున్నాడు. పూజా సామాగ్రిలో ఆవునెయ్యి ప్రధానం కావటంతో.. కల్తీ నెయ్యిని ఆవునెయ్యిగా మార్చి దేవుడిని కూడా వదలకుండా మోసం చేస్తూ కల్తీకి పాల్పడుతున్నాడు. అన్నామలై తయారు చేస్తున్న కల్తీ నెయ్యి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని, గుండె జబ్బులు, కొవ్వు సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. సోదాల్లో సుమారు 200 కేజీల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అన్నమలైపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. పండుగ సీజన్లలో ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో ఆహారనాణ్యతపై అధికారులు నిఘా పెంచుతున్నారు.









Comments are closed