బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంపై ప్రతిపక్ష వైసీపీలో రచ్చ కొనసాగుతోంది. ఎందుకంటే రేపల్లె నియోజకవర్గానికి ఎవరిని పంపాలని ప్రయత్నించినా వెనుకడుగు వేస్తున్నారు.. రేపల్లె నియోజకవర్గానికి గత ఎన్నికలవరకూ ప్రాతినిధ్యం వహించిన బీసీ నేత, మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ వైసీపీ ఓటమి పాలయ్యాక టిడిపిలో చేరారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల నాటికి మోపిదేవి వెంకటరమణ వారసుడికే టికెట్ ఇవ్వాలని వైసీపీ భావించింది. కానీ, ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.
దాంతో రేపల్లె వైసీపీ స్థానం ఖాళీ అయింది. దీనిని బీసీ సామాజిక వర్గ నేతకే ఇవ్వాలని కొన్నాళ్లు ప్రయత్నం చేసిన తర్వాత అనూహ్యంగా గతంలో అంబటి రాంబాబు ఒకసారి అక్కడ గెలవడంతో రేపల్లె బాధ్యతలు అంబటికే ఇవ్వాలని నిర్ణయించారు.ప్రస్తుతం సత్తెనపల్లి ఇన్చార్జిగా ఉన్న అంబటిని రేపల్లెకు మారాలని వైసీపీ అధిష్టానం సూచించిందట.. అయితే రేపల్లె వైసీపీ క్యాడర్ అంతరంగాన్ని తెలుసుకున్న అంబటి తనకు అక్కడ ఎలాంటి ప్రాధాన్యం లేదని గతంలో ఉన్నట్టుగా రేపల్లె రాజకీయాలు ఇప్పుడు లేవని వెనక్కి తగ్గారట. ప్రస్తుతం రేపల్లెలో టీడీపీ హవా జోరుగా ఉంది. మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా ఏమాత్రం తగ్గట్లేదు. మోపిదేవి వెంకటరమణ వంటి బలమైన బీసీ నాయకుడు టిడిపిలో చేరడంతో ఆబలం మరింత పెరిగింది. దాంతో అనవసరంగా పోటీ చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకన్న ఉద్దేశంతో అంబటి తప్పుకున్నారు.
అయితే ఈ స్థానాన్ని చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడుదల రజినీకి అప్పగించాలని వైసీపీ భావించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావడంతో పాటు ఆమెకు రేపల్లె ఆమెకు సెట్ అవుతుందన్న నమ్మకంతో జగన్ రజినీని రేపల్లె వెళ్లాలని కోరారట.. అయితే అంబటి రాంబాబు వద్దన్న సీటును తాను తీసుకోవడం ఏంటి అన్న ఉద్దేశంతో రజనీ కూడా రేపల్లెపై ఇష్టం చూపించడం లేదు.
స్థానికంగా బలమైన నాయకుడు అనగాని సత్యప్రసాద్ ఉండగా అక్కడికి వెళ్లే సాహసాన్ని వైసీపీలో ఎవరూ చేయడం లేదట.. అయితే చిలకలూరిపేట లేదంటే మొత్తంగా పోటీనుంచి తప్పుకుంటానని చెప్తోందట.. ఏదేమైనా మొదటిసారి మంత్రి అయిన అనగాని వైసీపీలో మంత్రులుగా పనిచేసిన ఇద్దరినీ భయపెట్టాడంటే ఇది మామూలు విషయం కాదనే చెప్పాలి.















Comments are closed