మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతిపై పదే పదే చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య 10 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖ రాశారు. లేఖ ప్రతులను శనివారం మీడియాకు విడుదల చేశారు.
‘తిక్కలోడు తిరునాళ్ళు పోతే, కొండ మెట్లు ఎక్కాదిగా సరిపోయింది’ అంటారు. అమరావతిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారం కూడా అంతే. ఆయన మూడు రాజధానుల కొండ మెట్లు ఎక్కలేక, దిగలేక మదనపడుతున్నారు.ఆయనకు కూడా తెలియని ఆ ‘మూడు’ ఎక్కడో వెతుక్కుంటున్నారు. ప్రజా రాజధాని అమరావతిపై ఐదేళ్ళు కక్ష కట్టి, రైతులపై కత్తి దూసి, వేధించి, చెరశాలకు పంపించి, రాజధాని ఎక్కడ? అన్న ప్రశ్నకు ఐదున్నర కోట్ల మంది తెలుగు ప్రజలను నాలుగు దిక్కులు చూసేలా చేసి, మళ్లీ అమరావతిపై ‘అపరిచితు’లా మాట్లాడుతున్న తీరు చూస్తుంటే, ఆయన మానసిక పరిస్థితిపై, ఆరోగ్య పరిస్థితులపై సందేహాలు వస్తున్నాయి. ఈ పది ప్రశ్నలకు మీ మానస పత్రికలో దమ్ముంటే వివరణ ఇవ్వండి అంటూ అని సవాల్ చేశారు.
ప్రశ్నలు:
- ఒకటి విజయవాడ – గుంటూరు నగరాల మధ్య రాజధాని ఉండాలని ఆనాటి అసెంబ్లీలో మీరు జై కొట్ట లేదా?ముఫై వేల ఎకరాలకు మించి ఉండాలని చెప్పలేదా?
- రాజధానిలో ఇల్లు కట్టుకున్నాను. చంద్రబాబు నాయుడు గారి కంటే మిన్నగా రాజధాని నిర్మిస్తాను? అని హామీ ఇచ్చారా? లేదా?
- మీ పితూరీ గుణాన్ని ప్రోత్సాహించి రాజధానిని ఎడారి అని ఒకసారి, స్మశానం అని మరోసారి, రాజధానిలో ఒక సామాజిక వర్గం మాత్రమే ఉందని ఇంకోసారి అనిపించారా? లేదా?
- మళ్లీ మీరే రాజధానిలో వరదలు వస్తాయని, భూకంపాలు వస్తాయని, మునిగిపోతుందని మాట మార్చారా? లేదా?
- మూడు రాజధానులు మీ తారక మంత్రం అని, మళ్లీ అధికారంలోకి వస్తే, విశాఖ వెళ్ళిపోతానని శబథం చేశారా? లేదా?
- ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అని, అతను ఎటు వెళితే అటు కోతి పిల్లను వెంటబెట్టుకుని వెళ్ళినట్లు వెళ్ళవచ్చు అని అన్నారా? లేదా?
- రాజ్యాంగంలో క్యాపిటల్ అనే మాటే లేదని మీకు ఎవరు చెప్పారు? అలాంటప్పుడు మూడు రాజధానులు ఏ రాజ్యాంగం నుంచి దిగుమతి చేశారు? మీరు పెట్టిన కొత్త జిల్లాలకు జిల్లా రాజధానులు ఎలా ఏర్పాటు చేశారు?
- రాజధాని రైతులను ఏడిపించింది ఎవరు? వారు ఏడుస్తుంటే తపోవనంలోని సీతమ్మను చూసి రావణుడు నవ్వినట్లు నవ్వింది ఎవరు?
- రాజధానిలో రోడ్లు తవ్వింది ఎవరు? కంప చెట్లు పెంచింది ఎవరు? త్రాచు పాములను పోషించినది ఎవరు? ఎస్సీ లపై ఎస్సీ కేసు పెట్టించింది ఎవరు?
- నదీ గర్భంలో రాజధాని నిర్మాణాలు ఉంటే, తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడ ఉంది ? అసెంబ్లీ ఎలా నిర్వహించారు? సచివాలయం ఎలా నిర్వహించారు? హైకోర్టుకు ఎలా పోయారు? మీ వాహన శ్రేణి ఏ పడవ ప్రయాణం చేసింది ?
ఇలా అమరావతిపై రోజుకో అబద్దం, పూటకో అశుద్ధం అమరావతి పై ఎంతకాలం? మీరు మారరా? మార్పు రాదా? మీ మంది మార్భలంతో, పిండారీలతో దాడి చేసినట్లు రాజధానిపై ఎంతకాలం దాడి చేయిస్తారు? మీ విధానాల్ని 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఛీత్కరించారు. తిరస్కరించారు. ఐనా నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా పాత అబద్దాల్ని, పాత అసత్యాల్ని పదేపదే పాడిందే పాటగా వల్లే వేస్తే మీకు కలిగే రాజకీయ లబ్ధి ఏమిటి? మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒరిగే మేళ్ళు ఏమిటి? అంటూ బాలకోటయ్య ప్రశ్నలు సంధించారు.










Comments are closed