సైబర్ నేరగాళ్ల దుశ్చర్య ఏస్థాయికి చేరిందో మరోసారి రుజువైంది. ఏకంగా హైదరాబాద్లోని ఓ ఉన్నత పోలీసు అధికారికే మోసం చేసేందుకు సైబర్ కేటుగాళ్లు ప్రయత్నించారు. ఖైరతాబాద్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న శిల్పవల్లికి ఓవర్ స్పీడ్ చలాన్ పేరుతో నకిలీ మెసేజ్లు పంపి టోకరా వేయాలని చూశారు. మీ వాహనం అధిక వేగంతో వెళ్లినట్లు ట్రాఫిక్ కెమెరాల్లో రికార్డయిందని పేర్కొంటూ, మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు మెసేజ్లు పంపించారు. చలాన్ వివరాలు చూడాలంటే తాము పంపిన లింక్పై క్లిక్ చేయాలని సూచిస్తూ, చివర్లో ‘ట్రాఫిక్ నియమాలు పాటించండి’ అని రాసి ఉండడం గమనార్హం. నిజమైన ప్రభుత్వ సందేశంలా కనిపించేలా ఈ మెసేజ్లను రూపొందించడం ఆందోళన కలిగిస్తోంది.
అయితే ఈ మెసేజ్లు నకిలీవని గుర్తించిన డీసీపీ శిల్పవల్లి అప్రమత్తంగా వ్యవహరించారు. అనుమానాస్పద లింక్ను క్లిక్ చేయకుండా వెంటనే ‘సంచారాధి’ యాప్లో ఫిర్యాదు చేశారు. అనంతరం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఇలాంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ శాఖల పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని, చలాన్ వివరాలను తెలుసుకోవాలంటే కేవలం అధికారిక యాప్లు లేదా వెబ్సైట్లనే ఉపయోగించాలని ఆమె సూచించారు. ఒక్క క్లిక్తో బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఈ ఘటన ద్వారా సైబర్ నేరగాళ్లు ఎవ్వరినీ వదలడం లేదని స్పష్టమవుతోంది. సైబర్ మోసాల నుంచి రక్షణ పొందాలంటే ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండటం అత్యవసరం. అనుమానాస్పద మెసేజ్లు, లింకులు, కాల్స్కు దూరంగా ఉండడమే సురక్షిత మార్గమని పోలీసులు సూచిస్తున్నారు.











Comments are closed