జనగామ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవాలనుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బావమరిది పెద్ది నవీన్ కుమార్ గౌడ్కు చుక్కెదురైంది. 6వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి, మున్సిపల్ ఛైర్మన్ పీఠం దక్కించుకోవాలని ఆయన వేసిన ప్లాన్ తలకిందులైంది. అభ్యర్థుల తుది జాబితాలో నవీన్ పేరు లేకపోవడంతో ఆయన షాక్కు గురయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్ భార్యకు స్వయంగా తమ్ముడైన నవీన్ కోసం స్వయంగా మంత్రి, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగానే ప్రయత్నించినా నవీన్ ‘స్థానికేతరుడు’ (హనుమకొండకు చెందిన వ్యక్తి) అంటూ స్థానిక కాంగ్రెస్ నేతలు భీష్మించుకు కూర్చున్నారు. నవీన్కు టికెట్ ఇవ్వొద్దంటూ సంతకాల సేకరణ చేపట్టి అధిష్ఠానానికి పంపారు.
దాంతో స్థానికుల ఒత్తిడికి తలొగ్గిన ఎంపిక కమిటీ చివరకు బుక్క బాల భరద్వాజ్ను 6వ వార్డు అభ్యర్థిగా ఖరారు చేసింది. గతంలో రెండుసార్లు పార్టీ కోసం త్యాగం చేసి నామినేషన్లు ఉపసంహరించుకున్న బాల భరద్వాజ్కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కమిటీ భావించింది. టికెట్ నిరాకరణతో నవీన్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. పార్టీ టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగానైనా లేదా మరో పార్టీ తరపున అయినా నవీన్ను బరిలోకి దించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే జనగామ 6వ వార్డులో కాంగ్రెస్ అధికారిక అభ్యర్థికి గట్టి పోటీ తప్పదు.
జనగామ మున్సిపాలిటీలో మొత్తం 30వార్డులకు గానూ కాంగ్రెస్ 26స్థానాల్లో పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా సీపీఎంకు 3, సీపీఐకి 1 వార్డు కేటాయించారు. టికెట్లు రాని మరికొంతమంది అసమ్మతి నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.















Comments are closed