ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ 5వ బడ్జెట్ సమావేశాల తొలిరోజే సభలో భావోద్వేగ వాతావరణం నెలకొంది.గవర్నర్ ప్రసంగం సమయంలో చోటుచేసుకున్న పరిణామాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తంచేశారు. సభ్యుల ప్రవర్తన వల్ల సభాగౌరవం దెబ్బతింటోందని ఆయన వ్యాఖ్యానించారు. యువతకు మరియు విద్యార్థులకు చట్టసభల పనితీరుపై అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో లోకేష్ గారు ‘మాక్ అసెంబ్లీ’ అనే కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు లభించిందని, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు సైతం దీన్ని ప్రశంసించారని స్పీకర్ గారు గుర్తుచేశారు.
“నిన్న గవర్నర్ గారు ప్రసంగిస్తున్నప్పుడు సభలో జరిగిన దృశ్యాలు నన్ను కలచివేశాయి. సభ్యులు నినాదాలు చేస్తూ, కాగితాలు చింపి వేయడం వంటి చర్యలు అత్యంత బాధాకరం” అని స్పీకర్ గారు అన్నారు. వేలాది మంది పోటీ పడితే కేవలం 175 మందికి మాత్రమే దక్కే అరుదైన గౌరవం ఈ సభలో సభ్యులుగా ఉండటం అని, ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200లకు పైగా విద్యాసంస్థల నుండి విద్యార్థులు అసెంబ్లీని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని స్పీకర్ తెలిపారు. “మనం చేసే పనులను చూసి ఆ పసిపిల్లలు ఏం నేర్చుకుంటారు? చట్టసభలంటే వారికి చులకన భావం ఏర్పడితే దాన్ని మనం మళ్ళీ మార్చలేము” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సభా గౌరవాన్ని పెంచలేకపోయినా పర్వాలేదు కానీ, దిగజార్చే హక్కు ఎవరికీ లేదని స్పీకర్ స్పష్టంచేశారు. ప్రజలు మన ప్రతికదలికను గమనిస్తున్నారని, సభ్యులందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతూ స్పీకర్ తన ప్రసంగాన్ని ముగించారు.















Comments are closed