జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్ దుమారం రేపుతోంది. శ్రీధర్పై ఆరోపణలు చేస్తూ ఓమహిళ వీడియోలను విడుదల చేసింది. ఎమ్మెల్యేపై ఆరోపణలు రావడంతో.. జనసేన కీలకనిర్ణయం తీసుకుంది. శ్రీధర్పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసేందుకు కమిటీని నియమిస్తూ జనసేన పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
‘తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్ పై ప్రసార మాధ్యమాలలో వచ్చిన వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. ఈ అంశంపై ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించడమైనది. శ్రీ టి.శివశంకర్, శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి, శ్రీ టి.సి.వరుణ్ ఈ కమిటీలో ఉన్నారు. శ్రీ అరవ శ్రీధర్ ఏడు రోజుల్లోగా కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలి. కమిటీ సదరు ఆరోపణలపై నిజానిజాలు విచారణ చేసి పార్టీకి నివేదిక అందిస్తుంది. నివేదిక పరిశీలన చేసి, తుది నిర్ణయం వెలువడే వరకూ శ్రీ అరవ శ్రీధర్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేయడమైనది’ అంటూ జనసేన పార్టీ తెలిపింది.
ఎమ్మెల్యే శ్రీధర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని అదే నియోజకవర్గానికి చెందిన మహిళ సంచలన ఆరోపణలు చేశారు. శ్రీధర్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేశారని చెప్పుకొచ్చారు. అలాగే కొన్ని ప్రైవేట్ వీడియోలను విడుదల చేసింది. తనపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించారు. కొంతమంది తనను టార్గెట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని, మహిళ చేసిన ఆరోపణలపై కోర్టులో బదులిస్తానన్నారు. డీప్ ఫేక్ వీడియోలతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. వారిని వదిలేది లేదన్నారు. తన కుమారుడిపై ఆ మహిళ ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీధర్ తల్లి ప్రమీల చెప్పుకొచ్చారు. ఆ మహిళ శ్రీధర్ను రూ.25 కోట్లు డిమాండ్ చేసిందని, ఆమె బెదిరింపులకు దిగిన ఆడియోలు, వీడియోలు తమ దగ్గర ఉన్నాయని జనసేన పార్టీ నేత నాగేంద్ర చెబుతున్నారు.















Comments are closed