కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సోమవారం రాత్రి సరికొత్త అవతారంలో కనిపించారు. ఫుడ్ డెలివరీ బాయ్గా మారి పోరంకి, కానూరు, యనమలకుదురు ప్రాంతాల్లో స్వయంగా ఆహార ఆర్డర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డెలివరీ బాయ్స్ రోజూ ఎదుర్కొనే కష్టాలు, పని ఒత్తిడి, రాత్రివేళల్లో వారు పడే శ్రమ గురించి ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. డెలివరీ సమయంలో పలువురు బాయ్స్తో మాట్లాడిన ఎమ్మెల్యే, వారి జీవన పరిస్థితులు, ఆదాయం, పని గంటలపై ఆరా తీశారు. ముఖ్యంగా ట్రాఫిక్, వాతావరణ ప్రతికూలతలు, సమయపాలన ఒత్తిడి వంటి సమస్యలు ఎంతగా ఇబ్బందిపెడుతున్నాయో తెలుసుకున్నారు. రాత్రివేళల్లో కష్టపడి పనిచేసే డెలివరీ బాయ్స్కు సమాజం తగిన గౌరవం ఇవ్వాలని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. “వారు మన సౌకర్యం కోసం శ్రమిస్తున్నారు. వారి పట్ల మర్యాదగా, మానవీయంగా వ్యవహరించాలి” అని అన్నారు. ఎమ్మెల్యేను డెలివరీ బాయ్ రూపంలో చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు వీడియోలు తీస్తూ, ఆయనను అభినందించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నం ప్రశంసనీయం అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.














Comments are closed