కట్న వ్యవస్థపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరిపల్లి గ్రామస్థులు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ఉద్యోగం, ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ పెళ్లి కాకుండా ఉన్న యువకుల ఫోటోలతో గ్రామంలో బ్యానర్లు ఏర్పాటు చేశారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన పశువుల పండుగలో ఈ బ్యానర్లను ప్రదర్శించి, సమాజానికి బలమైన సందేశాన్ని ఇచ్చారు. పెళ్లికొడుకులు లేదా వారి తల్లిదండ్రులు వచ్చిన సంబంధాలకు హెచ్చెలకు పోయి అధిక కట్నాలు డిమాండ్ చేయడం, పెళ్లికూతురుపై అనవసర ఆరోపణలు చేయడం కొనసాగితే, వారి ఫోటోలు కూడా ఇలానే బహిరంగంగా బ్యానర్లలో కనిపించాల్సి వస్తుందనే హెచ్చరికను గ్రామస్థులు ఇచ్చారు.
అధిక కట్నాల ఆశతో సంబంధాలను తిరస్కరిస్తే, చివరకు వేరే రాష్ట్రాలకు వెళ్లి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్న వాస్తవాన్ని ఈ కార్యక్రమం గుర్తు చేస్తోంది. కట్న రహిత వివాహాలు చేసుకుని, అమ్మాయిలను గౌరవంగా చూడాలనే ఆలోచన యువతలో రావాలని గ్రామ పెద్దలు సూచించారు.
ఈ సంఘటన ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కట్నం లేని సమాజమే నిజమైన అభివృద్ధి అనే సందేశాన్ని కలికిరిపల్లి గ్రామం బలంగా చాటింది.












Comments are closed