తెలుగు రాష్ట్రాలమధ్య విద్వేషాలు ఉండకూడదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో తెలుగుజాతి నెంబర్ వన్గా ఉండాలని, దీనికి తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. తెలుగుజాతి నెంబర్ వన్గా ఉండాలంటే… మనం ఐకమత్యంగా ఉండాలన్నారు. తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలున్నా… తెలుగే మాతృభాష అని, రెండు రాష్ట్రాలు కలిసి ఉంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాకే సాగర్ జలాలను ఉపయోగించుకునేలా ఎస్ఎల్బీసీ, ఎస్ఎర్బీసీ ప్రాజెక్టులు తెచ్చారని, కల్వకుర్తి లిఫ్ట్, ఏఎమ్మార్ ఎత్తిపోతల, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను తాను పూర్తి చేశానన్నారు.
కృష్ణా డెల్టా మోడరైజేషన్ పేరుతో నీరు పొదుపుచేసి, ఆ నీటిని తెలంగాణకు కేటాయించి, బీమా లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసామన్నారు. గోదావరిపై గుత్ప, అలీసాగర్, దేవాదుల ఎత్తిపోతల వంటి పథకాలను చేపట్టామని, అలాగే ఆంధ్రలో చాగల్నాడు, పుష్కర, తాటిపూడి వంటి లిఫ్ట్ ప్రాజెక్టులు తీసుకువచ్చామని తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు నీరిచ్చామని, విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం పోలవరానికి ప్రత్యేక నిధులిచ్చిందని వివరించారు, ప్రత్యేక చట్టం రూపొందించిందని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.
గతేడాది సుమారు కృష్ణా, గోదావరి నదుల నుంచి 6,282 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. గోదావరి నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, ఆ నీళ్లను తెలంగాణ వాడుకున్నా తాను ఏనాడు అడ్డు చెప్పలేదని స్పష్టం చేశారు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా అభ్యంతరం చెప్పలేదన్నారు. ప్రతి ఏడాది గోదావరి నుంచి సముద్రంలోకి మూడువేల టీఎంసీల నీళ్లు వృథాగా పోతున్నాయని, అందుకే కృష్ణా-గోదావరి నదులు అనుసంధానం జరుగుతుందని వెల్లడించారు. ఏపీలోని నదులన్నింటినీ అనుసంధానించాలని, తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఉండకూడదని అన్నారు. తాను ఎప్పుడూ ఐక్యత గురించే తాను మాట్లాడతానని చెప్పుకొచ్చారు. నీటి విషయంలో, సహకారం విషయంలోనైనా తెలుగువారంతా కలిసి ఉండాలని సూచించారు. గంగా-కావేరి కలవాలని.. దేశంలో నీటి సమస్య పూర్తిగా తీరాలని.. అదే తన కోరిక అన్నారు. కృష్ణా డెల్టా అభివృద్ధి పేరుతో నీటిని తెలంగాణకు అందించామని వివరించారు.














Comments are closed