వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించిన సైబర్ నేరగాళ్లు ఓవ్యక్తిని నమ్మించి రూ.1.63 కోట్లు కొట్టేసారు. అనకాపల్లిలోని గవరపాలెం పరమేశ్వరి ఉద్యానం సమీపంలో నివాసం ఉంటున్న శరగడం మహేంద్ర సూర్యకుమార్ గతంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేసేవారు. ఇటీవల సోషల్ మీడియా, ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల ద్వారా పరిచయం ఏర్పడిన వ్యక్తులు వ్యాపార పెట్టుబడుల పేరుతో ఆయనను సంప్రదించారు. మొదట చిన్ మొత్తంలో పెట్టుబడి పెట్టించి, కొద్ది రోజుల్లోనే రూ.40 వేల లాభం వచ్చినట్లు చూపించి నమ్మకం కలిగించారు. తరువాత మరింత పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని ప్రలోభపెట్టి దశలవారీగా పెద్ద మొత్తాలు పంపేలా చేశారు.
లాభాలు రావడం ఆగిపోవడం, సంప్రదించిన వ్యక్తులు అందుబాటులోకి రాకపోవడంతో మోసం జరిగినట్లు బాధితుడు గ్రహించాడు. మొత్తం కలిపి రూ.1.63 కోట్ల వరకు నష్టపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆన్లైన్లో అధిక లాభాలు వస్తాయని చెప్పే పెట్టుబడి ఆఫర్లకు మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్, లింకులు, ఖాతాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.















Comments are closed