హైదరాబాద్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ సైబర్ మోసగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయాడు. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ మహిళ చెప్పిన మాయమాటలు నమ్మి, నకిలీ ట్రేడింగ్ యాప్లో పెట్టుబడులు పెట్టి ఏకంగా రూ.2.14 కోట్లు కోల్పోయాడు. ఈ ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల వివరాల ప్రకారం, టీఎన్జీవో కాలనీకి చెందిన 44 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగికి గతేడాది డిసెంబర్లో సోషల్ మీడియా ద్వారా ఓ మహిళ పరిచయమైంది. తాను స్టాక్ ట్రేడింగ్ ద్వారా భారీ లాభాలు సంపాదిస్తున్నట్లు ఆమె నమ్మించింది. ఆమె మాటలు విశ్వసించిన బాధితుడితో ఓ నకిలీ ట్రేడింగ్ యాప్ను డౌన్లోడ్ చేయించింది. డిసెంబర్ 12న తొలిసారిగా రూ.31.5 లక్షలు పెట్టుబడి పెట్టగా, యాప్లో లాభాలు వచ్చినట్లు చూపించడంతో బాధితుడు మరింత నమ్మాడు.
అనంతరం రెండో విడతగా రూ.42.27 లక్షలు బదిలీ చేశాడు. లాభాలు విత్డ్రా చేసుకునే ప్రయత్నంలో, వచ్చిన మొత్తంపై యూఏఈ ప్రభుత్వానికి 30 శాతం పన్ను చెల్లించాలి అంటూ మోసగాళ్లు మెలిక పెట్టారు.యాప్లో కనిపిస్తున్న వర్చువల్ లాభాలను నిజమని నమ్మిన బాధితుడు, ఆఫీసు సహోద్యోగుల నుంచి సుమారు రూ.90 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. కుటుంబ సభ్యుల నుంచి డబ్బు సేకరించి, కొన్ని ఆస్తులను కూడా అమ్మి మొత్తం 8 విడతల్లో రూ.2.14 కోట్లు మోసగాళ్ల ఖాతాల్లో జమ చేశాడు. చివరకు డబ్బు విత్డ్రా చేయడానికి ప్రయత్నించగా, అదనంగా మరో రూ.68 లక్షలు చెల్లించాలి అని చెప్పడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు.
వెంటనే అప్రమత్తమైన బాధితుడు ఆ మహిళ ఫొటోను ఇంటర్నెట్లో పరిశీలించగా, అది ఇన్స్టాగ్రామ్లోని వేరొకరి ప్రొఫైల్ నుంచి దొంగిలించినదని తేలింది. దీంతో నకిలీ ప్రొఫైల్ ద్వారా మోసానికి గురయ్యానని గుర్తించిన బాధితుడు, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.














Comments are closed