జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో కల్వకుంట్ల కవిత మద్దతుదారులు సంచలన విజయం సాధించారు. మొత్తం 10 వార్డులున్న ఈ మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేసిన కవిత మద్దతుదారులు ఏకంగా 8 స్థానాలను కైవసం చేసుకుని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్నారు. మిగిలిన రెండు స్థానాల్లో కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 1 వార్డును గెలుచుకున్నాయి. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉన్నందున, వ్యూహాత్మకంగా సింహం’ గుర్తుపై పోటీ చేసిన జాగృతి నాయకులు తొలి అడుగులోనే భారీ విజయాన్ని నమోదు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
వడ్డేపల్లితో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మరికొన్ని చోట్ల కూడా సింహం గుర్తు అభ్యర్థులు తమ ఉనికిని చాటుకున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని పలు వార్డుల్లో జాగృతి మద్దతు దారులు గెలుపొందినట్లు తెలుస్తోంది. గతంలో 2020 రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు 9 స్థానాల్లో గెలిచి బలమైన ముద్ర వేయగా, ఇప్పుడు కవిత నాయకత్వంలో ఆ పార్టీ గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థులు వడ్డేపల్లి వంటి చోట్ల పూర్తి మెజారిటీ సాధించడం విశేషం.
ఈ విజయంతో తెలంగాణ రాజకీయాల్లో కవిత కొత్త ప్రయాణం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ముందే ఆమె సింహం’ గుర్తును తమ గుర్తుగా ప్రకటించి, ప్రచారం నిర్వహించడం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. సొంత పార్టీ అధికారికంగా ఆవిర్భవించక ముందే ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో తమకు బలం ఉందని ఆమె నిరూపించుకున్నారు.















Comments are closed