బెంగళూరులో గత నెల రోజులుగా ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని రోడ్లపై వేధింపులకు పాల్పడుతున్న వినోద్ అనే వ్యక్తిని కమాక్షిపాళ్య పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. నిందితుడు రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే మహిళలను బలవంతంగా కౌగిలించుకోవడం, బైక్పై వెళ్తున్న మహిళలు గుంతల వద్ద వేగం తగ్గించగానే వారి వద్దకు పరుగెత్తుకెళ్లి హత్తుకోవడం, అసభ్యంగా తాకడం వంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి.. తాజాగా
డిసెంబర్ 2న సుంకదకట్టెలోని శ్రీనివాస సర్కిల్ వద్ద జరిగిన ఘటనతో విషయం వెలుగులోకి వచ్చింది. 42ఏళ్ల మహిళ స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి ఆమె భర్త కారులో వస్తున్నారు. గుంత కారణంగా ఆమె వేగం తగ్గించగానే వినోద్ పరుగెత్తుకొచ్చి ఆమెను గట్టిగా పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె భర్త పట్టుకునేందుకు ప్రయత్నించగా నిందితుడు తప్పించుకున్నాడు.
బాధితులు వెంటనే ఎమర్జెన్సీ నంబర్ 112కు ఫోన్ చేయడంతో హొయసల పోలీసులు స్పందించి వినోద్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో గత నెల రోజులుగా ఇలాంటి దాడులకు పాల్పడినట్లు వినోద్ అంగీకరించాడు. ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతోనే తాను ధైర్యంగా ఈ పనులు చేశానని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.
వినోద్ కు ఎలాంటి మానసిక సమస్యలు లేవని, సైకో మనస్తత్వంతో వికృత చేష్టలకు పాల్పడుతున్నట్టు పోలీసులు చెప్తున్నారు..














Comments are closed