చిత్తూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. దుర్మార్గులనుండి రక్షించాల్సిన తండ్రే భక్షకుడిగా మారి, కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నూతన సంవత్సర వేడుకల వేళ జరిగిన ఈ దారుణం మానవత్వానికే మచ్చగా నిలిచింది.
పెద్దపంజాణి మండలం పెద్ద బూరుగుపల్లి ఎస్టీకాలనీకి చెందిన పెద్దబ్బ అనే వ్యక్తికి 12ఏళ్ల కూతురు ఉంది. భార్య వదిలి వెళ్లిపోవడంతో అతడు రెండో పెళ్లి చేసుకుని అదే గ్రామంలో వేరుగా నివసిస్తున్నాడు. మైనర్ బాలిక మాత్రం నానమ్మ వద్ద చదువుకుంటోంది.
జనవరి 1న న్యూఇయర్ సందర్భంగా కూతురిని చూడటానికి నానమ్మ ఇంటికి వచ్చిన పెద్దబ్బ, తండ్రిని చూసిన ఆనందంతో దగ్గరకు వచ్చిన బాలికపై కీచక బుద్ధితో దాడికి పాల్పడ్డాడు. మద్యంమత్తులో మానవత్వం మరిచిపోయి బాలికను బలవంతంగా ఇంటి వెనుక ఉన్న మామిడి తోటలోకి లాక్కెళ్లాడు. అడ్డువచ్చిన తన తల్లిని కూడా నిర్దయగా కొట్టి, తోటలోని బండరాయి వద్ద బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
బాలిక కేకలు విని నానమ్మ అక్కడికి చేరుకునేలోపే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో పెద్దపంజాణి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పలమనేరు రూరల్ సీఐ పరశురాముడు నేతృత్వంలో చేపట్టిన ఆపరేషన్లో, నిందితుడిని రాయలపేట–పలమనేరు రోడ్డులోని గుత్తివారిపల్లి క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు.
నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇలాంటి కీచకులకు కఠిన శిక్ష పడాల్సిందేనని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది.














Comments are closed