ఆత్మ గౌరవానికి ప్రతీకగా కొలిచే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణా కుంభమేళాగా పేరొందిన మేడారం మహా జాతరను వైభవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. గిరిజన ఆదివాసీ ఆచార సంప్రదాయాలతో 4రోజుల పాటు జరిగే పండుగను వన దేవతల మహోత్సవంగా జరుపుకోవాలని అన్నారు. కోటిన్నరకు పైగా భక్తులు తరలి వచ్చే జాతరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఘనంగా ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
చరిత్రలో నిలిచిపోయేలా మేడారం ఆలయాన్ని ప్రభుత్వం పునర్నిర్మించిందని గుర్తుచేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా నిధులు కేటాయించిందని గుర్తుచేశారు. రూ.250 కోట్లతో ఆలయ ప్రాకారం విస్తరణతో పాటు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజు గద్దెలను విశాలంగా నిర్మించామన్నారు. గిరిజన ఆదివాసీ ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా సమ్మక్క సారమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఆధునీకరించి, ప్రాంగణానికి నలుదిశలా తోరణాలను నిర్మించినట్లు గుర్తుచేశారు. లక్షలాదిగా నిరంతరం మేడారం తరలివస్తున్న భక్తులకు ఇబ్బందిలేకుండా రోడ్లు, శాశ్వత మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందన్నారు. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించేందుకు, ఆదివాసీల ఆచారాలను పరిరక్షణను ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించిందన్నారు.
మేడారం తల్లుల స్పూర్తితో జరిపిన ప్రజాస్వామ్య పోరాటం ఫలితంగా రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని వనదేవతల దీవెనలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రచరిత్రలో మొట్టమొదటి సారిగా తల్లులచెంత ప్రజాప్రభుత్వం రాష్ట్ర మంత్ మండలి సమావేశం నిర్వహించిందన్నారు. నాలుగు రోజుల పండుగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నిఏర్పాట్లు చేసిందన్నారు. కోటిన్నరమంది భక్తులు తరలివచ్చే అంచనాలు ఉండటంతో ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పని చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అమెరికా నుంచి సీఎం ఫోన్ లో ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడారు.
గిరిజనులు, ఆదివాసీలు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు అంతే భక్తి శ్రద్ధలతో వన దేవతలను దర్శనం చేసుకొని.. మొక్కులు చెల్లించుకోవాలని, జంపన్న వాగులో పుణ్య స్నానాలను ఆచరించాలని అన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుండా భక్తులు సహకరించాలని కోరారు. పోలీసు విభాగంతో పాటు అన్ని విభాగాల అధికారులు కలిసికట్టుగా మహా జాతర వైభవంగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం అన్ని విభాగాల అధికారులు నాలుగు రోజుల పాటు నిర్విరామంగా భక్తులకు అందుబాటులో ఉండాలని అప్రమత్తం చేశారు.














Comments are closed