తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం, ఈ నెల 11వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 125మున్సిపాలిటీల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో, వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. షెడ్యూల్ విడుదలైన నాటినుండి కేవలం రెండు వారాల వ్యవధిలో పోలింగ్ ప్రక్రియ పూర్తిచేసేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ప్రస్తుతం తుదిదశలో ఉంది.
వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల పై అధ్యయనం చేస్తున్న డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ముందడుగు వేయనుంది. ఈకమిషన్ నివేదిక అందిన వెంటనే ఏయే స్థానాలను ఏవర్గాలకు కేటాయించాలో నిర్ణయిస్తారు. రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా రిజర్వేషన్లు కేటాయించడమే ఈ కమిషన్ ప్రధాన ఉద్దేశం.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఈనెల 25 నాటికల్లా మొత్తం ప్రక్రియ ముగించే లక్ష్యాన్ని అధికారులు నిర్ధేశించుకున్నారు. ఒకవేళ 11న నోటిఫికేషన్ వస్తే, నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రచారానికి తక్కువ సమయం కేటాయించి, నెలాఖరులోపు కొత్త పాలక వర్గాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో స్థానిక సంస్థల్లో పాలన గాడిలో పడటమే కాకుండా, అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు వంటి ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమై ఉన్న నేపధ్యంలో వీలైనంత త్వరగా షెడ్యూల్ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.














Comments are closed