ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి మరో 15ఏళ్ల పాటు ఐక్యంగా కొనసాగాలని, అప్పుడే గుజరాత్ తరహా సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఎన్నికల ముందు ఏ స్ఫూర్తితో నిలబడ్డామో, అదే ఐక్యతను భవిష్యత్తులో కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి చంద్రబాబు సుదీర్ఘంగా ప్రసంగించారు. గడిచిన 20నెలల్లో కూటమిలో విభేదాలు రాకపోవడం శుభ పరిణామమని, ఇదే ఐక్యతతో పనిచేసి ఎమ్మెల్యేలు ప్రజల్లో మంచిపేరు తెచ్చుకోవాలన్నారు.
ఎన్నికలకంటే ఇప్పుడు కూటమికి ప్రజల మద్దతు మరింత పెరిగిందన్నారు. “గుజరాత్లో బీజేపీ వరుసగా ఐదుసార్లు గెలిచింది.. ఒకే ప్రభుత్వం సుదీర్ఘకాలం కొనసాగడం వల్లే అక్కడ అభివృద్ధి సాధ్యమైంది. మన రాష్ట్రంలోనూ అదే జరగాలన్నారు. మరో 15ఏళ్ల పాటు మూడు పార్టీలు ఐక్యంగా ప్రజలవద్దకు వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి ఉండాలని, అప్పుడే శాశ్వతంగా రాజకీయాల్లో నిలబడగలం అన్నారు.
ఈ సందర్భంగా శాసన సభ్యులకు కీలక సూచనలు చేశారు. “అసెంబ్లీ సమావేశాలను ప్రతి సభ్యుడు సీరియస్గా తీసుకోవాలి. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 1గంటవరకు సభలోనే ఉండాలి. నేనుకూడా సభను ఫాలో అవుతాను. సబ్జెక్టులపై అర్థవంతమైన చర్చలు జరగాలి. ఎదుటివారు తిట్టారని మనంకూడా తిట్టకూడదు. ప్రజామోదయోగ్యంగా సభను నడుపుదాం” అని అన్నారు.
వైసీపీ హయాంలో కూటమినేతలు ఎదుర్కొన్న అణచివేతను చంద్రబాబు గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ను విశాఖలో హోటల్ కే పరిమితం చేయడం, తన అరెస్టు సమయంలో అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం వంటి ఘటనలను ప్రస్తావించారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఐక్యంగా నిలబడి గెలిచామని, ఈస్ఫూర్తిని ఎప్పటికీ మరువకూడదన్నారు.
ముఖ్యమంత్రి అభిప్రాయంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏకీభవించారు. గత 20నెలలుగా ఐక్యంగా పనిచేసి, వైసీపీ ఐదేళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి ప్రగతిబాట పట్టిస్తున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం మరో 15 ఏళ్లు కూటమి కలిసి ఉంటుంది. ఐక్యంగా ముందుకు వెళ్తుంది. ఎన్నికల్లో ఏ స్ఫూర్తితో పనిచేశామో, అదే స్ఫూర్తి భవిష్యత్తులోనూ అవసరం. పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటే, వాటిని కూర్చుని పరిష్కరించుకోవాలి. ప్రతిఒక్కరూ కూటమి ధర్మానికి కట్టుబడి పనిచేయాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.















Comments are closed