రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండను సందర్శించారు. గురువారం మధ్యాహ్నం కోటప్పకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు విచ్చేసిన ఆయన త్రికోటేశ్వరస్వామి వారిని దర్శించుకుని, మధ్యాహ్న వేళ ప్రత్యేక పాదాభిషేక సేవలో పాల్గొన్నారు. అర్చక స్వాములు మేధా దక్షిణామూర్తి స్వరూపుడైన కోటయ్య స్వామికి పాదాభిషేకం చేసి, పుణ్య జలాన్ని శిరస్సుపై చల్లారు. పవన్ కళ్యాణ్ గారు స్వామి వారికి పట్టు వస్త్రాలు, ఫల ప్రసాదం సమర్పించారు. అనంతరం కోటప్పకొండ – కొత్తపాలెం గ్రామాల మధ్య పంచాయతీరాజ్ శాఖ నిధులతో నిర్మించిన నూతన రహదారిని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
గురువారం కోట్పకొండ క్షేత్ర దర్శనం అనంతరం కొండ దిగువన ఉన్న శివస్థూపం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రోడ్డుపై నడుస్తూ నాణ్యతను పరిశీలించారు. రూ. 3.9 కోట్ల నిధులతో 8 కిలోమీటర్ల మేర ఈ నూతన రహదారిని నిర్మించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక శాసన సభ్యులు డాక్టర్ అరవింద్ బాబు భక్తుల సౌకర్యార్ధం ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అర్జీ ఇచ్చారు. శివరాత్రి ఉత్సవాలలోపు రోడ్డు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కోటప్పకొండ – కొత్తపాలెం మధ్య నిర్మించిన ఈ రోడ్డుతో శివరాత్రి ఉత్సవాలకు వచ్చే సుమారు లక్షన్నర మంది భక్తుల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. కొత్తపాలెం గ్రామ పరిసరాల్లోని రైతులకు, గోనేపూడి పాఠశాలకు వెళ్లే విద్యార్ధులకు ఇబ్బందులు తొలగనున్నాయి. రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా గోనేపూడి పాఠశాల విద్యార్ధులు పవన్ కళ్యాణ్ ను కలిసి తమ కోసం రహదారి సౌకర్యం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. గోనేపూడి జిల్లా పరిషత్ పాఠశాలకు క్రీడా మైదానంతోపాటు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు.
అనంతరం కోటప్పకొండ ఘాట్ రోడ్డులో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనవిహారి జింకల పార్కును పవన్ కళ్యాణ్ గారు సందర్శించారు. పార్కులోనికి వెళ్లి జింకలకు స్వయంగా ఆహారం అందించారు. ఈ జింకల పార్కులో మచ్చల జింకలు ఉన్నాయని, జింకల సంరక్షణకు, వాటికి ఇబ్బందులు కలగకుండా పర్యాటకుల సందర్శనకు ఏర్పాట్లు చేసినట్టు అటవీశాఖ అధికారులు ఆయనకు వివరించారు. వనవిహారి పార్కుకు అనుసంధానంగా ఉన్న అటవీ భూబాగాన్ని పార్కులో ఉన్న వివిధ రకాల పక్షి జాతుల వివరాలు తెలియజేశారు. పార్కులో ఉన్న వృక్ష జాతుల వివరాలు, వాటి వల్ల కలిగే ఉపయోగాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పార్క్ సందర్శన నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రైన్ ను పరిశీలించి, దాని నిర్వహణ తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.















Comments are closed