జగన్ హయాంలో తనను కస్టోడియల్ టార్చర్ చేసిన అప్పటి సీఐడీచీఫ్ పీవ సునీల్ కుమార్ను డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు వదిలిపెట్టేలాలేరు. కూటమి సర్కార్ వచ్చి, సునీల్పై శరవేగంగా చర్య తీసుకోకపోయినప్పటికీ.. రఘురామ మాత్రం ప్రెస్మీట్లతో సునీల్ కుమార్ దుంప తెంచుతూనే ఉన్నారు. తాజాగా సునీల్ కుమార్ మూలాలలను బయటపెట్టి, ఆయనను మత, కుల సంకటంలో పడేశారు. క్రైస్తవ శ్మశానవాటికలో ఉన్న సునీల్ తల్లి సమాధి ఫొటోలను విడుదలచేసి.. ‘‘సునీల్ మతంమారినా ఆ విషయాన్ని దాచిపెట్టి దళితకోటాలో ఉద్యోగం సంపాదించారనడానికి ఇదిగోసాక్ష్యం’’ అంటూ ఫోటో, సమాధి ఉన్న క్రైస్తవ శ్మశానవాటిక వీడియోను విడుదల చేసారు.
రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయన ఫిర్యాదు మేరకు, ఇటీవల సునీల్కుమార్ను ఎస్పీ దామోదర్ విచారణకు పిలిచారు. విచారణలో అడిగినవాటికి సమాధానాలు చెప్పకపోయినా.. తనకు ఏమీ గుర్తులేదని చెప్పినా.. ఉదయంనుంచి సాయంత్రంవరకూ గుంటూరు పీసీఎస్లోనే గడిపారు… మళ్లీ పిలిచినప్పుడు రావాలని ఎస్పీ చెప్పారు. ఈలోగా సునీల్ కుమార్ తల్లి క్రైస్తవ సమాధి ఫొటోను, రఘురామ మీడియాకు విడుదల చేయడం కలకలం సృష్టించింది.
‘ఈ సమాధి గతం మర్చిపోయిన పీవీ సునీల్కుమార్ గారి మాతృమూర్తి గతించిన పిమ్మట పూడ్చి చింతలపూడి వెలవలలో కట్టినది. ఆమె వీడీఓగా పని చేశారు. పాతాళ గ్రేస్ ఆమెపేరు. వారిబిడ్డ ఎస్సీ సర్టిఫికెట్ (ఫేక్)తో ఐపిఎస్ సంపాదించారు. అందుకే గట్టిగా క్రిస్టియన్, దళితులకు రిజర్వేషన్కై ఏఐఎం పెట్టారేమో? ఇప్పుడు ప్రభుత్వం ఎంక్వయిరీ చేయాలి. . చూద్దాం. ఇప్పుడు గజనీగా మారిన సునీల్గారికి.. తల్లిగారి, వారిమతం గుర్తుఉందో? లేదో?’ అంటూ కాప్షన్ పెట్టారు.
ఈ సమాధి ఆధారంగా.. సునీల్ కుమార్ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దుచేయాలని కోరుతూ, ఏలూరుజిల్లా కలెక్టర్కు లేఖ రాసేందుకు రఘురామ సిద్ధమవుతున్నారు. సునీల్ కుమార్ తండ్రి గంగరాజు, ప్రతి ఆదివారం సీఎస్ఐ చర్చికి వెళ్లి ప్రార్ధనలు చేస్తున్న విషయాన్ని కూడా ఫిర్యాదు చేయనున్నారు.
సునీల్ మతం మారిన విషయాన్ని దాచిపెట్టి, దళితకోటాలో ఐపిఎస్ సంపాదించిన సునీల్పై తగిన చర్య తీసుకోవడంతోపాటు.. ఇప్పటివరకూ ఆయన ప్రభుత్వం నుంచి పొందిన జీతాన్ని, పూర్తిగా రికవరీ చేయాలని కోరుతూ డిఓపీటీ అధికారులను స్వయంగా కలసి ఫిర్యాదు చేయనున్నారు రఘురామ..
దేశంలో ఒక ఐపిఎస్ అధికారి మతం మారి, ఆ సర్టిఫికెట్తో ఉద్యోగం సంపాదించారనడానికి తొలిసారి ఆధారాలు లభించిన నేపథ్యంలో.. ఈఅంశాన్ని జాతీయస్థాయిలో చర్చనీయాంశం చేయాలని రఘురామ కృష్ణంరాజు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈఅంశంలో ఆయన తాడోపేడో తేల్చుకోవాలన్న గట్టి పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా ఈ వ్యవహారాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్షా కు వివరించాలని రఘురామరాజు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
దేశంలోని ఐపిఎస్లలో సునీల్ తరహాలో.. ఎంతమంది మతం మారి ఉద్యోగాలు సంపాదించుకున్నారన్న దానిపై విచారణ జరపాలని కోరుతూ, ఆయన ఒక వినతిపత్రం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమిత్షాను కలసిన తర్వాత, సునీల్ ఈ అంశాన్ని జాతీయమీడియా దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు.. మతంమారి ఉద్యోగాలు సంపాదించిన వారిపై, జ్యుడి షియల్ కమిషన్ వేయాలని గళం విప్పనున్నారు. ఆ మేరకు ఆయనతో కొన్ని హిందూ సంస్థలు చర్చిస్తుండటం ప్రస్తావనార్హం.
అయితే సునీల్ కమార్ కూడా ఇందుకు తగ్గట్టుగానే స్పందిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుపై ఒక పోస్టు పెట్టారు. రఘురామరాజు కంపెనీలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకుని, పోస్టు పెట్టినట్లు కనిపించింది. ‘‘ దర్యాప్తు సక్రమంగా జరగటం కోసం నన్ను సస్పెండ్ చేశారు. మంచిదే. మరి సమన్యాయం కోసం రఘురామకృష్ణంరాజు గారిని కూడా అన్ని పదవులనుంచి తొలగించి సస్పెండ్ చేయాలి కదా.? సిబీఐ దర్యాప్తు సక్రమంగా జరగడానికి ఆయనను పదవులనుంచి పదవుల నుంచి తొలగించాలి.. చట్టం అందరికీ సమానం అనే మెసేజ్ వెళ్లాలి’’ అని పోస్టు పెట్టారు.
‘‘ ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరిగి మూడేళ్లయింది. అది కూడా తెలియకుండా పోస్టులు పెట్టే అజ్ఞానుల గురించి నేనేం మాట్లాడను’’ అని రఘురామరాజు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు.
అలాగే తాను క్రైస్తవులకు ఏమాత్రం వ్యతిరేకం కాదు. పైగా క్రైస్తవులను గౌరవిస్తానంటున్నారు. క్షమాహృదయం ఉన్న క్రైస్తవాన్ని వ్యతిరేకించడం తెలివితక్కువ పని.. కానీ క్రైస్తవమతం తీసుకుని, దళిత కోటాలో ఉద్యోగాలు సంపాదించడం.. మళ్లీ ఆముసుగులో ఇతరులపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడానికి మాత్రమే తాను వ్యతిరేకమఅని చెప్తున్నారు.
గతంలో సుప్రీంకోర్టు కూడా మతం మారినవారికి రిజర్వేషన్లు వర్తించవు అని చెప్పింది. అసలు క్రైస్తవానికి చెడ్డపేరు తీసుకువస్తున్నదే ఈమతం మారిన వారు.. కాబట్టే నాపోరాటానికి నిజమైన క్రైస్తవులు మద్దతునిచ్చి, ఆశీర్వదిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.
దీనివల్ల అసలైన క్రైస్తవుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నదే తన ఆవేదన.. ఆందోళన అని ఆయన వివరించారు. ‘‘ పాపం అసలు నిజమైన క్రైస్తవులు తెలుగు రాష్ట్రంలో ఎంతమంది ఉంటారు..? మతం మారిన వారే ఎక్కువన్నది ప్రభుత్వాలకూ తెలుసు. నిజమైన క్రైస్తవుల కోసం ప్రభుత్వాలు ఏం చేసినా స్వాగతించాల్సిందే. నాపోరాటం కూడా మతంమారి ఉద్యోగాలు సంపాదిస్తున్న ఇలాంటి సునీల్ లాంటివారిపైనే’’ అని రఘురామరాజు స్పష్టం చేశారు.















Comments are closed