అంతర్జాతీయ మార్కెట్ లో దేశీయ కరెన్సీ రూపాయి విలువ అంతకంతకూ పడిపోతోంది.. తాజాగా రూపాయి విలువ మరింత పతనమై ఆల్టైమ్ కనిష్ఠానికి చేరుకుంది. డాలర్తో పోలిస్తే రూపాయితే మారకపు విలువ రూ.5 పైసల క్షీణించి 90.83కు చేరింది. భారత్-అమెరికా డీల్పై అనుమానాలు, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వంటి కారణాల వల్లే రూపాయి మారకం విలువ క్షీణించడానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. ప్రధానంగా భారత్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం ఆలస్యమవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింటోందని చెబుతున్నారు.
వీటికితోడు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకులు, డాలర్కు డిమాండ్ పెరగడం వంటివి కారణాలుగా చెప్తున్నారు. ఈ క్షీణత మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని, త్వరలో 91 మార్క్ కూడా దాటొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నుండి నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 400పాయింట్లకు పైగా పతనమవగా, నిఫ్టీ 25,900 మార్క్ వద్ద ఊగిలాడుతోంది. ఎర్లీ ట్రెడింగ్లో సెన్సెక్స్ 359.13 పాయింట్లు దిగజారి 84,854.23 వద్ద, నిఫ్టీ 105.55 పాయింట్ల నష్టంతో 25,921.75 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ నుండి నెగిటివ్ ఇండికేషన్ మదుపర్ల అప్రమత్తత సూచీలను ఒత్తిడికి గురిచేస్తుంది.
రూపాయి పతనంపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. రూపాయి దాని స్థాయిని అదే కనుగొంటుందని వ్యాఖ్యానించారు. రూపాయి బలహీనతను రాజకీయం చేయవద్దని కోరారు. గతంలో తమ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధిక ద్రవ్యోల్బణం, బలహీనమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా రూపాయి పతనం మరింత ఆందోళన కలిగించిందని, ప్రస్తుత ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయని ఆమె గుర్తుచేశారు.
అయితే రూపాయి విలువ పతనం ప్రవాసులకు కలిసి వస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా రెమిటెన్స్లు భారత్కు వస్తున్నాయి కాబట్టి ప్రతి నెల 500 డాలర్లు పంపేవారికి, ఇప్పుడు రూ.40,వేలకు బదులు రూ.45వేలు వస్తాయి. అలాగే డాలర్లలో ఆదాయం పొందే ఐటీ, ఫార్మా కంపెనీల కూడా ఆదాయాలు పెరుగుతాయి. అలాగే రూపాయి పతనం చమురు దిగుమతులపై ప్రభావం పడుతుంది.ఎలక్ట్రానిక్స్, ఎరువులు, వంట నూనెల కోసం కూడా విదేశీ సరఫరాదారులపై ఆధారపడుతోంది. రూపాయి పడటం వల్ల ఈ దిగుమతి బిల్లులు పెరుగుతాయి. ఇక ముడి చమురు దిగుమతుల ఖర్చు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. ఫలితంగా రవాణా ఖర్చులు భారం అవుతాయి. తద్వారా నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. అంతేకాకండా విదేశాల్లో చదువుతున్న విద్యార్థులపై కూడా భారం పడుతుంది. ఈ పరిణామాలతో నిపుణులు ఆందోళన చెందుతున్నారు.









Comments are closed