జర్మనీలోని గెల్సెన్కిర్చెన్ నగరంలో జరిగిన బ్యాంక్ దోపిడీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు వినీ చూడని రీతిలో దుండగులు పక్కా ప్రణాళికతో బ్యాంక్ను టార్గెట్ చేసి, కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను దోచుకెళ్లారు. జర్మనీ నేర చరిత్రలోనే ఇది అతిపెద్ద బ్యాంక్ దోపిడీగా అధికారులు భావిస్తున్నారు.
దుండగులు బ్యాంక్ పక్కనే ఉన్న పార్కింగ్ గ్యారేజీని ఎంచుకొని, అక్కడి నుంచి భూగర్భంగా సొరంగం తవ్వారు. ఆ సురంగం ద్వారా బ్యాంక్ గోడకు కన్నం వేసి, లోపలికి చొరబడ్డారు. సీసీటీవీ కెమెరాలు, అలారం వ్యవస్థలను తప్పించుకుంటూ, పూర్తి ప్రొఫెషనల్గా ఈ దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు.
బ్యాంక్ లోపలికి ప్రవేశించిన అనంతరం దుండగులు ఏకంగా 3,200 సేఫ్టీ లాకర్లను పగులగొట్టారు. లాకర్లలో ఉన్న నగదు, బంగారం, విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. మొత్తం దోపిడీ విలువ సుమారు ₹316 కోట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ దోపిడీలో సుమారు 2,500 మంది ఖాతాదారులు తమ జీవితకాల పొదుపులను కోల్పోయారు. బ్యాంక్ ఎదుట బాధిత ఖాతాదారులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ ఆస్తులకు బ్యాంకే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఫోరెన్సిక్ నిపుణులతో పాటు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి, సీసీటీవీ ఫుటేజ్, సురంగం మార్గం, ఉపయోగించిన పరికరాల ఆధారంగా దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ఇది అంతర్జాతీయ ముఠా పనేనా? లోపలి సమాచారం లీక్ అయ్యిందా? అన్న కోణాల్లోనూ విచారణ కొనసాగుతోంది.
ఈ భారీ దోపిడీతో జర్మనీలో బ్యాంకుల భద్రతపై తీవ్ర చర్చ మొదలైంది. అత్యాధునిక భద్రతా వ్యవస్థలు ఉన్నప్పటికీ, ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. కోట్ల విలువైన ఆస్తులు మాయం కావడం, వేలాది మంది ఖాతాదారులు నష్టపోవడం… ఈ కేసు చివరికి ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే.














Comments are closed