తిరుమల తిరుపతి దేశస్థానంలో జరిగిన పరకామణి విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరకామణిలో చోరీకి సంబంధించి విచారణలో భాగంగా హుండీ లెక్కింపు ప్రక్రియను సమూలంగా ప్రక్షాళించాలని ధర్మాసనం ఆదేశించింది. ఈసందర్భంగా టీటీడీకి హైకోర్టు ముఖ్య సూచనలు చేసింది. దొంగతనాలను అరికట్టేందుకు రెండు దశలలో సంస్కరణలు చేపట్టాలని, కానుకల లెక్కింపులో మానవ ప్రమేయాన్ని తగ్గించి ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ సహా అత్యాధునిక యంత్రాలను వినియోగించాలని సూచించింది.
ఇందుకోసం వెంటనే టెక్నాలజీ ఉపయోగించి పలు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించింది. హుండీ సీలింగ్, రవాణా, లెక్కింపు విషయంలోనూ తక్షణం చేపట్టాల్సిన భద్రతా చర్యలపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఇరువురు న్యాయవాదులకు సూచించింది. శాశ్వత సంస్కరణలో భాగంగా కానుకలను సెపరేట్ చేయడం, విదేశీ కరెన్సీని గుర్తించేందుకు, విలువైన లోహాలను వేరు చేసేందుకు అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. నిందితుడు రవికుమార్, అతని కుటుంబ సభ్యుల ఆస్తుల అమ్మకాలు, రిజిస్ట్రేషన్ల వివరాలను సీల్డ్ కవర్లో వారంలోపు తమముందు ఉంచాలని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది.













Comments are closed