బెంగళూరులో జరిగిన ఓ ఘటన కర్ణాటకతో పాటు మహారాష్ట్రలోనూ సంచలనం రేపుతోంది. రెండు నెలల క్రితం ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి సూరజ్ శివన్న (36)తో గణవి (26) అనే యువతికి ఘనంగా వివాహం జరిగింది. అక్టోబర్ 29న నిర్వహించిన రిసెప్షన్కు వధువు తల్లిదండ్రులు సుమారు రూ.40 లక్షల వరకు ఖర్చు చేసారు. పెళ్లి తర్వాత దంపతులు 10 రోజుల క్రితం హనీమూన్ కోసం శ్రీలంక వెళ్లారు. అయితే అక్కడ ఇద్దరిమధ్య తీవ్ర విభేదాలు చోటుచేసుకోవడంతో కేవలం ఐదురోజులకే బెంగళూరుకు తిరిగివచ్చారు. వారిమధ్య ఏంజరిగిందో స్పష్టంగా తెలియకపోయినా, బుధవారం మధ్యాహ్నం గణవి అత్తింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
గణవిమృతితో ఆమె కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి ఆరోపణలతో అత్తింటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో భర్త కుటుంబం నుంచి ఎదురైన ఒత్తిడే గణవి ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావించారు.
ఈ నేపథ్యంలో కేసునమోదైన వెంటనే భర్త సూరజ్ శివన్న తనతల్లి జయంతి, సోదరుడు సంజయ్తో కలిసి మహారాష్ట్రలోని నాగ్పూర్కు పారిపోయాడు. అయితే భార్య మరణించిన రెండురోజులకే, నాగ్పూర్లో సూరజ్ శివన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం అతడి సోదరుడు సంజయ్ నాగ్పూర్ పోలీసులకు తెలియజేశాడు.
ఇలా ఉంటే.. ఈ రెండు ఘటనల ప్రభావంతో సూరజ్ తల్లి జయంతి కూడా బంధువుల ఇంట్లో ఆత్మహత్యకు ప్రయత్నించింది. కుటుంబసభ్యులు వెంటనే స్పందించి ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.. ఇలా
ఒకే పెళ్లి చుట్టూ వరుసగా మూడు ఆత్మహత్యల ప్రయత్నాలు, మరణాలు జరగడంతో ఈ కేసు మరింత సంక్లిష్టంగా మారింది. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర పోలీసులు కలిసి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరిన్ని విషయాలు నిజాలు విచారణలో వెలుగులోకి రావాల్సి ఉంది.















Comments are closed